అశిమ్ మిశ్రాతో రామ్ చరణ్‌కు ఏ గొడవా జరగలేదట!

అశిమ్ మిశ్రాతో రామ్ చరణ్‌కు ఏ గొడవా జరగలేదట!

Published on Dec 7, 2016 12:44 PM IST

aseem_mishra

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ థియేటర్లలో సందడి చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఈ శుక్రవారం పెద్ద ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇప్పటికే భారీ ఓపెనింగ్స్ సాధించేలా కనిపిస్తోంది. ఇక టీమ్ కూడా ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే భాగంగా తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ధృవ షూటింగ్ సమయంలో వచ్చిన ఒక పుకారుపై స్పష్టతనిచ్చారు. ‘ధృవ’కు బాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ అశిమ్ మిశ్రా మొదట్లో ఐదు రోజులు పనిచేశాక, సినిమా నుంచి బయటకొచ్చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో పీ.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టారు.

రామ్ చరణ్‌తో గొడవ జరగడం వల్లే అశిమ్ మిశ్రా సినిమానుంచి బయటకొచ్చారని అప్పట్లో ఓ ప్రచారం జరిగింది. ఈ పుకారు గురించే సురేందర్ రెడ్డి క్లారిటీ ఇస్తూ.. “అశిమ్ మిశ్రా ధృవ సినిమాకు ఒప్పుకునే ముందే ‘బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి ఉంది, అది మొదలైతే ఏ రోజైన ధృవ నుంచి వెళ్ళిపోతా’ అని చెప్పారు. ఆయన అనుకున్నదానికంటే ముందే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్ళడం, ధృవ కాస్త ఆలస్యం అవ్వడంతో అశిమ్ మిశ్రా ఐదురోజులు మాత్రమే పనిచేశారు. ఆయనొక గొప్ప సినిమాటోగ్రాఫర్. ఉన్న కొద్దిరోజులైనా అందరితో బాగా ఉన్నారు. గొడవై వెళ్ళిపోయారన్నది నిజం కాదు” అని తెలిపారు. ఏక్ థా టైగర్, దబంగ్, భజరంగీ భాయ్‍జాన్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు అశిమ్ మిశ్రా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు