ఎంపీగా గెలిపిస్తే గిరిజన బిడ్డలకు అన్నివిధాలా తోడుగా ఉంటానంటున్న కొత్తపల్లి గీత

ఎంపీగా గెలిపిస్తే గిరిజన బిడ్డలకు అన్నివిధాలా తోడుగా ఉంటానంటున్న కొత్తపల్లి గీత

Published on Apr 4, 2024 1:42 AM IST

కొత్తపల్లి గీత పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రభుత్వాధికారిగా రాజకీయవేత్తగా అందరికీ ఆమె సుపరిచితమే. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-1 అధికారిగా సేవలందించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీచేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన మరుసటి రోజు నుంచే అరుకును అభివృద్ధిబాటలో నడిపించి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని విబేధాలతో బయటికొచ్చి ఎంపీగానే కొనసాగుతూ 2018లో స్వయంగా జనజాగృతి పార్టీని కూడా ఏర్పాటు చేసి అనంతరం కొన్ని పరిస్థితుల రీత్యా దానిని బీజేపీలో విలీనం చేశారు. 

నాటి నుంచి బీజేపీ నేతగా కొనసాగుతూ నియోజకవర్గానికి తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రావడంతో ఆమె కృషికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అంతేకాదు అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న గీతను సీటు దక్కేలా చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ కొత్తపల్లి గీత దూసుకెళ్తున్నారు. ఇక అరకు ఎంపీగా గెలిస్తే విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను బాగు చేయడం ఈ నాలుగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు గీత. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్థులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు పనిచేయడానికే తాను ముందుంటానని చెబుతున్నారు. దీంతోపాటు ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా చేస్తామని మాటిచ్చారు. 

గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ చేయకుండా ఉండటానికి తనవంతుగా యుద్ధం చేస్తానని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న మనిషి. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగానే కాకుండా ప్రతి కుటుంబానికి ఉద్యోగం గిరిజనులను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా మోదీ ఉన్నారు.అరకు ప్రాంతానికి వ్యాపారం పేరిట వచ్చి కొందరు అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడం మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి తనవంతు ప్రయాత్నాలు చేస్తానని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను దీన్ని రూపుమాపడానికి 2014లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని ఈసారి 2024 ఎంపీగా గెలిస్తే ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని అణిచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు గీత వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు