హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా సతీశ్ జవ్వాజి తెరకెక్కించిన సినిమా ‘బ్యాండ్ మేళం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన దర్శకుడు వీవీ వినాయక్, కోన వెంకట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వినాయక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ చూశా. హర్ష్ రోషన్ ఎనర్జిటిక్గా కనిపించాడు. కోన వెంకట్ నాకు మంచి స్నేహితుడు. నా ‘సాంబ’ సినిమాకి డైలాగ్స్, ‘అదుర్స్’ కథ రాశాడు. కోన సినిమా జర్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కోన గురించి తెలుసుకునే క్రమంలో తను మాజీ గవర్నర్ మనవడని, దర్శకుడు రామ్గోపాల్వర్మకు ఫ్రెండ్ అని తెలిసింది’ అని వినాయక్ తెలిపారు.
వినాయక్ ఇంకా మాట్లాడుతూ.. ‘రామ్ గోపాల్ వర్మ ఓ పాట రాయమని అడగ్గా.. ‘నేను పాట రాయడమేంటి?’ అని కోన వెంకట్ అడిగాడు. హిందీలో పాటను తెలుగులో రాయి అన్నది ఆర్జీవీ సూచన. ఆ మేరకు సాంగ్ రాసి ఇవ్వగా.. డైలాగ్స్ కూడా రాసేసి మూవీని డబ్ చేయమన్నారట ఆర్జీవీ. అదే ‘సత్య’ సినిమా. అలా రైటర్ అయి, ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అందుకుంటున్నాడు’ అని కోన వెంకట్ గురించి వినాయక్ చెప్పుకొచ్చాడు.


