ఎలాగైనా రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జేఎస్పీ పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఈ ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం నినాధానాలతో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇక జనసేనతో పొత్తులో భాగంగా తాజాగా చంద్రబాబు మళ్ళీ తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. తన పార్టీకి లబ్ది చేకూరేలా మాత్రమే పొత్తులు ఉండాలన్నది అయన కాన్సెప్ట్.
తొలివిడతలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి 94 సీట్లు జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. తెలుగుదేశం వాటా కింద వచ్చిన 94 స్థానాలకు అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే పేర్లు ప్రకటించారు. ఇంకో 19 స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించిన వాళ్లనే జనసేన తరఫున పోటీ చేయిస్తారా అన్నది తెలియాలి. ఇక జనసేన, టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారో చూడాలి.
ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు మరోసారి నష్టం చేసినట్లే అని క్యాడర్ భావిస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కానీ జనసేన తరఫున ఐదుగురి పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు. అంటే అయన ఎక్కడ పోటీ చేస్తారన్నది చెప్పలేదు. మరి మిగతా పొత్తులో భాగంగా ప్రకటించబోయే సీట్లలో జనసేన కు ఏఏ స్థానాలు దక్కుతాయో చూడాలి.