బెజవాడ టీడీపీలో కేశినేని నానికి చెక్

బెజవాడ టీడీపీలో కేశినేని నానికి చెక్

Published on Jan 5, 2024 10:49 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి పార్టీ చేస్తున్న కొన్ని పనులు అందరిలో విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ఆలోచనలకు పనులకు పలువురు పార్టీ నేతలు సైతం బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇక తమ పార్టీ తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేయని వాళ్ళను అయన ఎంతమాత్రం ఉపేక్షించరని మరోమారు రుజువైంది. విషయం ఏమిటంటే, ఈనెల ఏడోతేదీన తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు నాని బదులు ఆయనతమ్ముడి చిన్నిని ఇంచార్జిగా నియమించారు. అంతేకాకుండా తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నానిని పార్టీ ఆదేశించింది టిడిపి అధిష్టానం. ఏడున తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాటు చేయగా ఈ విషయమై చర్చించే నిమిత్తం చిన్ని, నాని వర్గీయులు తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిన్న బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాలవారూ కొట్టుకున్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్తా చిలికిచిలికి గాలివానలా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది.  

ఆ తరువాత అక్కడికి వచ్చిన చిన్నిని సైతం నాని వర్గీయులు అడ్డుకున్నారు. తరువాత ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. అనంతరం కేశినేని నానికి టీడీపీ హైకమాండ్‌ చెక్‌ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్‌ నియమించింది. అలాగే, కేశినాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నుండి ఆదేశం లభించింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. దీనిపట్ల నాని కూడా స్ట్రాంగ్ గా స్పందించారు. తాను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంటుగా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు. 

గత కొన్నాళ్లుగా చంద్రబాబుకు పూర్తి భక్తులుగా ఉంటూ వస్తున్న బోండా ఉమా వంటివాళ్ళు నానిని విజయవాడలో విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతినిధి బృందం నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్ళింది. ఇదే విషయాన్ని అయన ఫేస్బుక్ లో సైతం స్పష్టం చేసారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, అవి వస్తే ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాడినని అంటూ అయన చంద్రబాబు పై పరోక్ష విమర్శలు చేసారు. ఇక నేడో రేపో ఎంపీగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తరువాత తన రాజకీయ గమనం ఎటు ఉంటుందో తెలుస్తుంది అన్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతం కేశినేని నానిని పార్టీ కి దూరం పెట్టడం పై టిడిపిలో విభిన్న గళాలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ విషయమై నాని ఏవిధంగా ముందుకి నడుస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు