ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రాధాన్యతనిస్తూ వైసిపి ఇంఛార్జ్ ల రెండో జాబితా విడుదల  

ఎస్సీ, ఎస్టీ, బిసిలకు ప్రాధాన్యతనిస్తూ వైసిపి ఇంఛార్జ్ ల రెండో జాబితా విడుదల  

Published on Jan 2, 2024 12:54 AM IST

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో మంచి పేరు దక్కించుకున్న వైసిపి పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక తాజాగా ఇంఛార్జుల రెండవ జాబితాను విడుదల చేసింది ఆ పార్టీ. ముఖ్యంగా సామాజిక సాధికారతే లక్ష్యంగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైయస్ జగన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది యొక్క స్థానాలు మార్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకీ మార్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ను రామచంద్రాపురం నుండి రాజమండ్రి రూరల్ కు మార్పు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు మార్చారు. అలానే ఆయన స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశమిచ్చారు. 

ఇక యువకులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మచిలీపట్నం నుండి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్టమూర్తికి చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ కు అవకాశం కల్పించారు. పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుండి వంగ గీత, జగ్గంపేట నుండి తోట నరసింహం, ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు. మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ విజయవాడ వెస్ట్ నుండి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుండి బియస్. మక్బూల్ అహ్మద్ లకు అవకాశం కల్పించారు. కాగా సీఎం వైయస్ జగన్ సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్నట్లుగానే ఎస్సీ, ఎస్టీ లకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. 

ఎస్పీ సామాజిక వర్గం అయిన పాయకరావుపేట నుండి కంబాల జోగులు, పి. గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించారు. ఎస్టీ సామాజికవర్గం నుండి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి లకు అవకాశం కల్పించారు. బిసి సామాజిక వర్గం నుండి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్ లకు అవకాశం కల్పించారు. వైశ్య సామాజిక వర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశమిచ్చారు. అయితే తొలి జాబితాలో పదకొండు మంది, రెండో జాబితాలో 27 మందిని నియోజకవర్గ ఇన్ చార్జీలుగా నియమించారు. 

రెండు జాబితాలు కలిపి మొత్తం 38 మందిని నియమించి అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేశారు. గతంలో తాను చెప్పినట్లుగా వివిధ కారణాల వలన స్థానం కోల్పోయిన వారిని పార్టీ సేవలకు, నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని వైయస్ జగన్ చెప్పారు. సామాజి కవర్గాలకు న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇంఛార్జిల ఎంపిక జరిగింది. తాను తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపారు సీఎం వైయస్. జగన్. మొత్తంగా వైసిపి పార్టీ విడుదల చేసిన ఈ రెండు ఇంచార్జ్ ల జాబితాల పై పార్టీ శ్రేణుల సుముఖత వ్యక్తం అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు