ఇటీవల టిడిపి తో జనసేన పొత్తు అనంతరం ఆ పార్టీ వారికీ కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించబడడంతో పలువురి నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. దానికి సంబంధించి తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఘాటైన లేఖాస్త్రం సంధించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నావంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి, వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి.
మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి, కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి. గౌరవ చంద్రబాబునాయుడు గారు జైలులో ఉన్నప్పుడు మొత్తం టిడిపి కేడరు బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి బరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదండి, చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి. వారి పరపతి విఫరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి. పవర్ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి, ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి.
40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదండి. భగవంతుడ్ని ఆపరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి. కాని మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటివాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల ఫర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీచేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ండి అంటూ ఆయన సంధించిన లేఖాస్త్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.