స్కోచ్ రిపోర్ట్ లో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్

స్కోచ్ రిపోర్ట్ లో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్

Published on Feb 15, 2024 12:10 AM IST

Jagan

ఇటీవల 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇదివరకు ఏ ప్రభుత్వాలూ చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని చేర్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఊరూరా గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటివద్దకు రేషన్, పెన్షన్ వంటి అద్భుత విధానాలతో సీఎం వైయస్ జగన్ ప్రతి ఇంటికి బంధువయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంభిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ – 2023 లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. 

అంతకుముందు ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధానంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందుచూపుతో తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. పారదర్శక పాలన, ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది.

ఇక స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు. మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి. మొత్తంగా ఇది రాష్ట్రంలో వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధికి చిహ్నం అని, తప్పకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరొక్కసారి తమకు పట్టంగట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నాయి వైసిపి శ్రేణులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు