టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కొన్నాళ్ల పాటు జైలుకి వెళ్లొచ్చారు. అనంతరం బెయిలు పై వచ్చిన బాబు పై సిఐడి వారు తాజాగా మరొక కేసు నమోదు చేశారు. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు పై సీఐడీ కొరఢా ఝళిపించింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం చార్జ్షీట్ను దాఖలు చేసింది.
ఏ1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండీ కోగంంటి సాంబశివరావు లతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్షీట్లో సవివరంగా వివరించింది. టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్నెట్ ప్రాజెక్ట్ను కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు తెగించారు.
విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ను ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్ట్ను చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు. అంతేకాదు చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ను ఏపీ ఈ-గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నిబంధనలను విరుద్ధంగా ఆయన్ని ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. ఇక ప్రాజెక్ట్ విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతంగా పెంచేశారు. వేమూరి హరికృష్ణ, ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈపోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ చంద్రబాబుఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోనే లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు.
టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టేరాసాఫ్ట్ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. ఇక ప్రాజెక్ట్ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు.
వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు.
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది. ఫైబర్నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది.
ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవమరించారని వారు సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.