2014 ఎన్నికల తరువాత మరొక్కసారి 2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అయితే అంతవరకు అంతా బాగున్నా లోలోపల మాత్రం కొన్ని అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి అనడానికి ఇటీవల జరిగిన కొన్ని ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఇటీవల మండపేట రా కదలిరా సభలో టిడిపి అభ్యర్ధిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరు ప్రకటించారు చంద్రబాబు. ఈ విషయమై చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థుల ప్రకటన చేసారంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. నిజానికి పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు ప్రకటించకూడదు కానీ సీట్లు ప్రకటించారు. కాగా ఆ అభ్యర్థుల ప్రకటన జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందని, అందుకుగాను పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెబుతున్నా అని మాట్లాడారు పవన్.
వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం అంటూ తాజాగా రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. మొత్తంగా అయితే పైకి పొత్తు ధర్మం పాటిస్తున్నాం అంటూ చెప్పుకుంటున్న టిడిపి, జనసేన రెండూ కూడా లోలోపల మాత్రం ఆ ధర్మాన్ని అసలు పాటించడం లేదనేదానికి ఇవి రుజువులు అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు ఎంతమేర తమ ఆమోదాన్ని అందిస్తారో చూడాలి.