స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట

Published on Jan 16, 2024 12:00 AM IST

ఇటీవల స్కిల్‌ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరించింది. కేసులో రిమాండ్‌ విధించే అధికారం విజయవాడలోని ఎసిబి కోర్టుకు పూర్తిగా ఉందని తేల్చి చెప్పేసింది. అయితే అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్‌ 17 ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తీర్పు ఇవ్వగా 17 ఏ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం త్రివేది తీర్పు ప్రకటించారు. దాంతో చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్‌ పిటిషన్‌ను బదిలీ చేసింది. ఓవరాల్‌గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు నిరాశ కలిగించే అంశమే.

జస్టిస్‌ బోస్‌ ఏమని తీర్పు చెప్పారంటే ఈ కేసులో 17 ఏ వర్తిస్తుంది. బాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌ కు వర్తింపజేయరాదు. అయినా బాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు అని స్పష్టం చేశారు. జస్టిస్‌ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17 ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17 ఏ రక్షణగా ఉండకూడదు అని స్పష్టం చేశారు. చివరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఒకరకంగా ఈ కేసుతో చంద్రబాబుకు చిక్కలు తప్పేలా లేవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు