నాడు వైయస్, నేడు జగన్ సింగిల్ గానే

నాడు వైయస్, నేడు జగన్ సింగిల్ గానే

Published on Jan 8, 2024 10:59 AM IST

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా అధికారం సొంతం చేసుకుని చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అనంతరం 2009 ఎన్నికల బరిలో ఒంటరిగా నిలిచి మరొక్కసారి విజయం అందుకున్న విషయం తెల్సిందే. అదే మాదిరిగా మొన్నటి 2019లో గెలిచిన వైసిపి అధినేత జగన్ కూడా రానున్న 2024 ఎన్నికల్లో మరొక్కసారి ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను స్ఫూరణకు తెస్తున్నాయి కదా. అవును నిజమే అప్పట్లో 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి మహా కూటమి ఏర్పాటు చేశాయి. 

మరో వైపు  చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆరోజుల్లో గొప్పగానే కనిపించేది. దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది. చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్ కు కాపులు దూరం అయినా వీటన్నిటినీ అడ్డుకుని మళ్ళీ ఆనాడు వైయస్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరేసింది. అంతేకాకుండా ఆనాడు రెండోసారి యుపిఎ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో 33 సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్ర నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు. 

ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం 294 స్థానాలకుగాను కాంగ్రెస్- 157, తెలుగుదేశం, తెరాస, వామపక్షాలు కలిసివచ్చిన మహాకూటమి -106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం – 18,  ఇతరులు 13 సీట్లు గెలిచారు. అంతిమంగా వైఎస్సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు సమర్ధుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ఆయన ముందు దిగదుడుపే. కాగా మళ్ళి అదే చరిత్ర 2024లో పునరావృతం అవుతుంది అంటున్నాయి వైసిపి వర్గాలు. ఆ సిద్ధాంతం ప్రకారం 2009లో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ, ప్రస్తుతం పొత్తులో ఉండగా బిజెపిని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి పెద్దలను కలిసి తమతో కలిసిరావాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నోరకాలుగా బిజెపిని తమతో కలుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 

ఇక కమ్యునిష్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనుకాడరు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని ప్రజలే తమకు మద్దతుదారులు అని చెబుతూ  తన అంతర్గత సర్వేలు, నివేదికలు లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇటు చంద్రబాబు జనసేన ఎవరికీ ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు.జగన్ మాత్రం సంక్షేమం, అభివృద్ధి తనను గెలిపిస్తాయి అంటూ సింగిల్ గా వెళ్తున్నారు. అప్పట్లో వైయస్ఆర్ సాధించినట్లే సింగి హ్యాండ్ విజయం సాధిస్తాం అని జగన్, అయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. మరి రానున్న 2024 రసవత్తర ఎన్నికల్లో ఏ పార్టీ భేరి మ్రోగిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు